Cancer Patient | క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడిపై ముగ్గురు పోలీసులు దారుణానికి ఒడిగట్టారు. కీమోథెరపీ చికిత్సతో కాళ్లు, చేతులకు వెంట్రుకలు ఊడిపోవడంతో అమ్మాయిలు ఉన్నావంటూ వేధించడమే కాకుండా, అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో జరిగిన ఈ ఘటలన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
బాధితుడి కథనం ప్రకారం.. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా బన్గావ్ గ్రామానికి చెందిన ఓ యువకుడు (30) బ్యాంక్ ఉద్యోగి. కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న అతను కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు. జూన్ 17వ తేదీన రాత్రి తన బైక్పై ఇంటికి వెళ్తుండగా ఇంద్రి రోడ్డులో పోలీసులు తనిఖీ కోసం వాహనాన్ని ఆపారు. మొహానికి గుడ్డ కట్టుకోవడంతో అతన్ని ఆపి ఇద్దరు ఏఎస్సైలు, హోంగార్డు నిలదీశారు. యువకుడిని చెంపదెబ్బలు కొట్టి, మొబైల్ ఫోన్ లాక్కొని బలవంతంగా లద్వా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
తాను క్యాన్సర్ రోగిని అని.. చికిత్స తీసుకుంటున్నానని చెప్పినా పోలీసులు సదరు యువకుడిపై కనికరం చూపించలేదు. కీమోథెరపీ తర్వాత శరీరంపై వెంట్రుకలు ఊడిపోతే.. అతని అనారోగ్యాన్ని ఎగతాళి చేశారు. కాళ్లపై వెంట్రుకలు లేకపోతే అమ్మాయిల స్మూత్గా ఉన్నావంటూ లైంగిక దాడికి పాల్పడ్డారు.
పోలీసుల దుశ్చర్య తర్వాత ఇంటికెళ్లిన యువకుడికి మరుసటి రోజు రక్తస్రావం జరగడంతో కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు. ఘటన తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తొలుత లద్వా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో లోక్నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఈ ఘటనపై బాధిత యువకుడు, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, వైద్య పరీక్షలు నిర్వహించి యువకుడి కాలు విరిగిందని, లైంగిక దాడి జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో అఘాయిత్యానికి ఒడిగట్టిన ఏఎస్సైలు సంజీవ్ కుమార్, రాజేందర్ కుమార్, హోంగార్డు సుమిత్లపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ చంద్రమోహన్ తెలిపారు. ఆ ముగ్గుర్ని సస్పెండ్ చేశామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.