Arvind Kejriwal | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తె లంగాణ): మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయినప్పటికీ, తమ సీఎం కేజ్రీవాలేనని, తీహార్ జైలు నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. అయితే, స్వతంత్ర భారతంలో సీఎం పదవిలో ఉండగానే అరెస్టయిన తొలి వ్యక్తిగా నిలిచిన కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగించడం అంత సులభమేమీ కాదని న్యాయ నిపుణులు, జైలు అధికారులు చెబుతున్నా రు.
తీహార్ జైలు నిబంధనల ప్రకా రం.. జైలులో ఉన్న వ్యక్తిని కుటుంబసభ్యులు, ఇతరులు వారానికి రెండుసార్లు మాత్రమే కలిసే అవకాశముంటుందని జైలు మాజీ అధికారి సునీ ల్ గుప్తా పేర్కొన్నారు. ఈ నిబంధనలతో పాలన సాగించడం కష్టమవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక అధికారాలతో ఏదైనా భవనాన్ని తాత్కాలికంగా జైలుగా మార్చి.. కేజ్రీవాల్ను తరలించి పాలనను అక్కడి నుంచి సాగించేలా మార్పులు చేయవచ్చని పేర్కొన్నారు. ఎల్జీ దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు.