Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. వేగంగా స్పందించిన ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ సంఘటనా స్థలానికి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అయితే, ఎంబసీ సమీపంలోని ప్రజలకు పెద్ద శబ్దం వినిపించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ ధ్రువీకరించింది. సాయంత్ర 5.47 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని, చాణక్యపురిలో ఎంబసీ వద్దకు వెళ్లినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ పేర్కొన్నారు. అక్కడ తనిఖీలు చేపట్టామని, పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదని చెప్పారు. అయితే, తప్పుడు సమాచారంగా అధికారులు పేర్కొంటున్నారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరుపనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. 2021లో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద స్వల్ప తీవ్రతతో బాంబు పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఈ కేసుపై ఇప్పటికీ ఎన్ఐఏ విచారణ జరుపుతున్నది.