సందేశ్ఖాలీ, మార్చి 5: పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడిపై దర్యాప్తును బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని మంగళవారం కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఫిబ్రవరి 29న అరెస్ట్ చేసిన ప్రధాన ముద్దాయి, టీఎంసీ నేత షాజహాన్ షేక్ను సీబీఐ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 4.30 లోగా తమ ఆదేశాలను పాటించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈడీ అధికారులపై జరిగిన సామూహిక దాడిపై దర్యాప్తునకు సీబీఐ, రాష్ట్ర పోలీసుల సంయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని జనవరి 17న సింగిల్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా అప్పీల్ చేశాయి.
ఈడీ అధికారులపై దాడి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం తలుపులు తట్టింది. షేక్ షాజహాన్ను సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాక రించింది.
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ హింస నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వి ధించాలని జాతీయ మహిళా కమిషన్ కోరింది. మంగళవారం కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై ఈ మేరకు సిఫారసు చేశారు. గతంలో షె డ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ కూడా టీఎంసీ పాలిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ను సిఫారసు చేసింది. అక్కడ నేటికీ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నదని శర్మ చెప్పారు.