న్యూఢిల్లీ, జూలై 13: ప్రధాని నరేంద్రమోదీ దేశం మొత్తానికి ప్రధానమంత్రి కాదని, గుజరాత్కు మాత్రమే ప్రధాని అంటూ తరచూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. అయితే కొన్ని సార్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు చూస్తుంటే అలాంటి అనుమానాలే కలుగుతుంటాయి. ఎప్పుడు కేంద్ర క్యాబినెట్ సమావేశమైనా సరే గుజరాత్కు కీలకమై ప్రాజెక్టులు మంజూరు చేస్తూ.. ఇతర రాష్ర్టాలకు మొండిచేయి చూపడం అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. బుధవారం కూడా ఆయన నేతృత్వంలో జరిగిన భేటీలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు కూడా పెద్ద తేడాగా ఏమీ లేవు.
గుజరాత్కు యూనివర్సిటీ, రైల్వే లైన్
గుజరాత్లో ఇప్పటికే ఉన్న నేషనల్ రైల్, ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ను గతిశక్తి యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. రవాణా రంగంలో విద్య, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన విషయంలో ఈ యూనివర్సిటీ హబ్గా మారుతుందని పేర్కొన్నది. అలాగే ఇప్పటివరకు డీమ్డ్ యూనివర్సిటీగా ఉన్న ఈ సంస్థకు సెంట్రల్ యూనివర్సిటీగా హోదా పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. అంతేకాదు. ఏకంగా రూ.2798.16 కోట్లతో 116.65 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైను కూడా గుజరాత్కు మంజూరు చేసింది. తారంగ హిల్- అంబాజీ-అబు రోడ్డు రైల్వే లైన్కు క్యాబినెట్లో ఆమోదం తెలిపారు.