Women Reservation Bill | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోద ముద్ర వేసింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరిట తీసుకొచ్చిన బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది. సుమారు 11 గంటల పాటు బిల్లుపై చర్చ జరిగింది. మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. పార్టీలకతీతంగా సభ్యులందరూ ఈ బిల్లుకు మద్దతుగా నిలిచారు. మొత్తం 215 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా.. బిల్లును ఒక్కరూ కూడా వ్యతిరేకించకపోవడం విశేషం. ఈ మేరకు ఓటింగ్ అనంతరం బిల్లును రాజ్యసభ ఆమోదించినట్టు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు.
ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లు జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం కార్యరూపం దాల్చే అవకాశంఉంది. లోక్సభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ నూతన పార్లమెంట్ భవనానికి మంచి ప్రారంభం లభించిందని తెలిపారు. చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ల బిల్లును నూతన పార్లమెంట్లో ఆమోదించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లును లోక్సభ ఆమోదించిన విషయం విదితమే. బుధవారం లోక్సభలో పార్టీలకతీతంగా 454 మంది ఎంపీలు బిల్లుకు మద్దతుగా నిలిచారు. ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉభయసభల్లోనూ ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది. దీని తర్వాత సుమారు దేశంలోని సగం అసెంబ్లీలు కూడా బిల్లుకు మద్దతు తెలపాల్సి ఉంది.
మహిళాబిల్లును నాలుగైదేండ్ల తర్వాత కాదు.. చట్టంగా మారిన వెంటనే అమల్లోకి తీసుకురావాలి. ఆర్టికల్ 370ని రాత్రికి రాత్రే రద్దు చేసినవారు.. మహిళా బిల్లును వెంటనే ఎందుకు అమలు చేయరు? జనగణన, పునర్విభజనతో ముడిపెట్టడం బాధాకరం. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగొచ్చు.
– రాజ్యసభలో బీఆర్ఎస్ నేత కేకే
గిరిజన సామాజికవర్గం నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి మహిళ ద్రౌపది ముర్మును నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదు. మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినప్పుడు, మణిపూర్లో యువతులను నగ్నంగా ఊరేగించినప్పుడు కేంద్రం నోరు మెదపలేదు.
– రంజిత్ రంజన్, ఎంపీ
కేంద్ర ప్రభుత్వానికి సహకారం, భాగస్వామ్యం అవసరం. మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించి అందరికీ తెలియజేయాలి. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉంది. కమాండో శైలిలో గోప్యతను పాటించడం సరికాదు. చర్చలో అందరినీ భాగస్వామ్యం చేయాలి.
– డెరిక్ ఓబ్రియన్, టీఎంసీ ఎంపీ
మీరు (బీజేపీ) పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతారని తెలుసు. ఇది కూడా పబ్లిసిటీయేనా? 2029 వరకు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొస్తారా లేదా అనేది కచ్చితంగా స్పష్టం చేయాలి. 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తారో లేదో అనుమానమే. లేదా ఓడిపోయే స్థానాల్లో మహిళలకు సీట్లు ఇస్తారో మరి.
– జయా బచ్చన్, ఎంపీ
2029 నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రధానమంత్రి, హోం మంత్రి సభలో హామీ ఇవ్వాలి. ఒకవేళ హామీ అమలు చేయడంలో విఫలమైతే వారు తమ పదవికి రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఎందుకు తీసుకొచ్చిందో మాకు తెలుసు. అందుకే రిజర్వేషన్ల అమలుపై హామీ కోరుతున్నా.
– కపిల్ సిబల్, ఎంపీ