న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు బుధవారం షెడ్యూల్ను ప్రకటించింది. పంజాబ్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీలో ఈ ఉప ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించడంతో హై-ప్రొఫైల్ సంగ్రూర్ ఎంపీ అయిన భగవంత్ మాన్ సింగ్ సీఎం అయ్యారు. దీంతో ఆ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. 2014లో తొలిసారి ఆప్ తరుఫున సంగ్రూర్ స్థానంలో ఎంపీగా గెలిచిన ఆయన 2019లో కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకుని లోక్సభలో ఆప్ ఏకైక ఎంపీగా నిలిచారు.
ఉత్తర ప్రదేశ్లోని రెండు ఎంపీ స్థానాలైన అజంగఢ్, రాంపూర్లో జూన్ 23న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. యూపీ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన గెలిచిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన సహచరుడు ఆజం ఖాన్ ఈ స్థానాలకు రాజీనామా చేశారు. కర్హల్లో అఖిలేష్ యాదవ్, రాంపూర్ అసెంబ్లీ స్థానంలో ఆజం ఖాన్ గెలిచారు.
ఈశాన్య త్రిపుర రాష్ట్రంలోని అగర్తల, టౌన్ బోర్దోవలి, సుర్మా, జుబరాజ్నగర్ అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి. జుబారాజ్నగర్ నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ స్పీకర్ రామేంద్ర చంద్ర దేబ్నాథ్ మృతి చెందారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మాన్, ఆశిష్ కుమార్ సాహా, ఆశిష్ దాస్ రాజీనామా చేసి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్లో చేరడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఢిల్లీలోని రాజిందర్ నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికపై అందరి దృష్టి నెలకొంది. ఎమ్మెల్యే రాఘవ్ చద్దా గత నెలలో రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ స్థానం ఖాళీ అయింది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్లోని ఆత్మకూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్ 23న ఉప ఎన్నిక జరగనున్నది. ఆ స్థానం వైసీపీ ఎమ్మెల్యే, పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 22న గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు. దీంతో ఆత్మకూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది.