కోల్కతా: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో (Odisha train tragedy) గాయపడిన ప్రయాణికులు బస్సు ప్రమాదానికి గురయ్యారు. ఆ క్షతగాత్రులు మరోసారి గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్కు చెందిన కొందరు ప్రయాణికులు బాలాసోర్ సమీపంలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్లో శనివారం ప్రమాదానికి గురైంది. పికప్ వాహానాన్ని ఆ బస్సు ఢీకొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. బస్సు ప్రమాదంలో మళ్లీ గాయపడిన వారిని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి గాయాలతో తమ ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది. బస్సు ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
కాగా, ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దాని కంపార్ట్మెంట్లు మెయిన్ లైన్పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే మెయిన్ లైన్లో వచ్చిన యశ్వంత్పూర్- హౌరా ఎక్స్ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ మొత్తం ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది చనిపోగా, 803 మంది ప్రయాణికులు గాయపడినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అనధికార గణాంకాలు చెబుతున్నాయి.