అహ్మదాబాద్: ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఐఏఎస్ అధికారిని ఎన్నికల విధుల నుంచి తొలగించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ను అహ్మదాబాద్లోని బాపునగర్, అసర్వా నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్గా ఈసీ నియమించింది. అయితే ఆ హోదా బోర్డు ఉన్న కారుతో ఫోటో దిగిన ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. గుజరాత్ ఎన్నికల పరిశీలకుడిగా విధుల్లో చేరినట్లు అందులో పేర్కొన్నారు. అలాగే మరో ముగ్గురు అధికారులతో కలిసి సాయుధ సెక్యూరిటీ మధ్య దిగిన మరో ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశారు. ఇవే ఫొటోలను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్, సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై ఈసీ స్పందించింది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఎన్నికల విధుల హాదా తెలిపే ఫొటోలను ఆయన పోస్ట్ చేసినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల నుంచి ఆయనను తొలగించింది. వెంటనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని, మాతృ కేడర్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
అలాగే ఎన్నికల విధుల కోసం ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్కు కల్పించిన ప్రభుత్వ వాహనం, భద్రతను కూడా ఈసీ ఉపసంహరించింది. ఆయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారి క్రిషన్ బాజ్పాయ్కు ఆ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. మరోవైపు డిసెంబర్ 1, 5న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.