బోర్ కొడితే అలా రైలెక్కి చంద్రునిపైకి వెళ్లి రావొచ్చు. కావలసివస్తే ఇంకొంత
దూరం రైల్లోనే వెళ్లి అంగారకుడికి హాయ్ చెప్పి రావొచ్చు. అక్కడే ఉండాలనిపిస్తే
కావాల్సినన్ని రోజులు ఉండొచ్చు. అచ్చం భూమ్మీద మన ఇంట్లో ఉన్నట్టే వాతావరణం ఉంటుంది. అక్కడ గలగలపారే నదులను చూడొచ్చు, పచ్చని ప్రకృతిని ఆస్వాదించొచ్చు. పక్షుల కిలకిలరావాల శబ్ధాలను వినొచ్చు. ఏంటీ.. సైన్స్ఫిక్షన్ సినిమా చూసి ఈ కథ చెప్తున్నాననుకొంటున్నారా? కాదండోయ్! దీన్ని నిజం చేస్తానంటున్నది జపాన్. భూమ్మీది నుంచి వయా చంద్రుడు అంగారకుడి వరకుబుల్లెట్ రైలును నిర్మించాలని ప్లాన్ చేస్తున్నది. అందుకోసం ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నది.
న్యూఢిల్లీ, జూలై 17: ఇప్పటి వరకు భూమ్మీది నుంచి చంద్రునిపైకి రాకెట్లను పంపించాం.. వ్యోమనౌకల్లో వెళ్లి వచ్చాం.. కానీ, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి రైలు పట్టాలు వేసి, రైల్లో ప్రయాణిస్తే? అక్కడి నుంచి మరో గ్రహానికి వెళ్తే? ఈ వినూత్న ఆలోచనకు రూపం ఇచ్చేందుకు జపాన్ సిద్ధమవుతున్నది. పనిలో పనిగా గ్రహాలపై బస చేసేందుకు క్యాప్సుల్స్ నిర్మించేందుకు రెడీ అవుతున్నది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ మాదిరి ఒక అంతరిక్ష కేంద్రాన్ని కూడా నిర్మించనున్నది. గ్రహాంతరయానం కోసం ఏర్పాటు చేసే పట్టాలను జపాన్ శాస్త్రవేత్తలు ‘హెక్సాట్రాక్’ అని సంబోధించారు.
ఈ ట్రాక్పై బుల్లెట్ రైలు నడిచే సమయంలో గురుత్వాకర్షణ శక్తి భూమ్మీద ఉన్నంతే ఉండేలా చర్యలు తీసుకొంటారు. రైళ్లు కూడా షడ్బుజి ఆకారంలోనే ఉంటాయి. 15 మీటర్ల వ్యాసార్థం కలిగిన చిన్న క్యాప్సుల్తో భూమిని, చంద్రున్ని.. 30 మీటర్ల వ్యాసార్థం కలిగిన క్యాప్సుల్తో చంద్రున్ని, అంగారకుడిని అనుసంధానం చేస్తారు. ఈ క్యాప్సుల్స్కు విద్యుదయస్కాంత సాంకేతికతను వాడుతారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీని జర్మనీ, చైనాలో మాగ్లేవ్ రైళ్లకు వాడుతున్నారు. రైళ్లు ఆగటానికి చంద్రునిపై, అంగారకుడిపై రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఆ రైలు పేరును స్పేస్ ఎక్స్ప్రెస్ అని నామకరణం చేసినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కృత్రిమ అంతరిక్ష నివాసం కూడా..
ప్రస్తుతం అంతరిక్ష నౌకల్లోనే భూమ్మీద ఉండే వాతావరణాన్ని శాస్త్రవేత్తలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, ఏకంగా చంద్రునిపైనే కృత్రిమ నివాసాన్ని సృష్టించేందుకు జపాన్ బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసింది. జపాన్కు చెందిన క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కజిమా కన్స్ట్రక్షన్ సహకారంతో గాజుతో నివాస స్థలాన్ని నిర్మించనున్నారు. దాని పేరు ‘ది గ్లాస్’. ఇది శంఖు ఆకారంలో, 1,300 అడుగుల పొడవుతో ఉంటుంది. అక్కడ భూమ్మీద ఉండే వాతావరణాన్ని, గురుత్వాకర్షణ శక్తిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు. ఆహార పదార్థాలు, చెట్లు, నీరు, నదులు, ఉద్యానవనాలు ఉంటాయి.
భూమ్మీద ఉన్నట్టే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రజా రవాణాను కొనసాగించొచ్చు. తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటే పునరుత్పత్తికి వీలుండదు. దానికోసం భూమ్మీద ఉండేంత కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని సృష్టిస్తారు. ది గ్లాస్ లోపల నివాసం ఉంటే స్పేస్ సూట్ ధరించాల్సిన అవసరం ఉండదు. దాన్నుంచి బయటకు వస్తే మాత్రం ధరించాల్సిందే. లోపలికి వెళ్లేందుకు, బయటికి రావటానికి ప్రత్యేకంగా ద్వారాలను ఏర్పాటు చేస్తారు. చంద్రునిపై విజయవంతమైతే అంగారకుడిపైనా ఇలాగే కృత్రిమ నివాసాన్ని సృష్టిస్తారు.
2050 నాటికి నమూనా
ఈ ఆలోచన కార్యరూపం దాల్చటానికి వందేండ్లు పట్టవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి మనం బతికి ఉండకపోవచ్చని, కాకపోతే 2050 నాటికి లూనా గ్లాస్, మార్స్ గ్లాస్ నమూనాలు తయారయ్యే అవకాశాలున్నాయని వెల్లడించారు. తమ అడుగు అంతరిక్ష రవాణాలో సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు.