Mahatma Gandhi | వారణాసి: జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వ సంపదపై కేంద్రం కన్నెర్ర చేసింది. వారణాసిలో ఉన్న గాంధీయన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన 12 భవనాలను శనివారం బుల్డోజర్లతో నేలమట్టం చేసింది. అడ్డువచ్చిన గాంధేయవాదులను అదుపులోకి తీసుకుని ఆ ప్రాంగణంలో స్వతంత్ర సమరయోధుడు జయప్రకాశ్ నారాయణ సహవ్యవస్థాపకునిగా ఏర్పాటు చేసిన గాంధీ విద్యా సంస్థాన్ సహా పలు భవనాలను కూల్చివేసింది.
ఈ భవనాలకు చెందిన స్థలం తమదేనంటూ రైల్వే శాఖ వాదిస్తుండగా, దీనిని తాము అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశామని గాంధేయవాదులు చెబుతూ వస్తున్నారు. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు, అలహాబాద్ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా రైల్వేకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడంతో వారు పోలీసు భద్రత మధ్య ఈ భవనాలను కూల్చివేశారు. కాగా, ఈ కూల్చివేతలను ప్రముఖ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఈ కూల్చివేతలు చరిత్రలో అవమానకర సంఘటనగా నిలిచిపోతుందని సర్వసేవా సంఘ అధ్యక్షుడు చందన్ పాల్ విమర్శించారు.