భోపాల్: వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమే లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో (Patna) ప్రతిపక్షాల నాయకులు (Opposition Meeting) నేడు సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో విపక్ష మీటింగ్పై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (CM Shivraj Singh Chouhan) విరుచుకుపడ్డారు. వారంతా గాలిలో కోటలు (Building castles in Air) కడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరేం చేసినా మోదీ మరోసారి ప్రధాని (PM Modi) కావడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. ప్రజలలో ఆయనపట్ల భక్తి, విశ్వాసం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి భారీ మెజారిటీతో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చౌహాన్ వెల్లడించారు. ఎవరైతే గాలిలో కోటలు కట్టాలని చూస్తున్నారో అలానే చేయనీయండి అంటూ వ్యాఖ్యానించారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో నేడు ప్రతిక్ష పార్టీల నాయకులు పాట్నాలో సమావేశం కానున్నారు. ఈ భేటీకి కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన ఉద్ధవ్ వర్గం అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతోపాటు సుమారు 20 పార్టీలకు చెందిన నాయకులు హాజరు కానున్నారు.