భోపాల్: నిరసన ప్రదర్శన కోసం తెచ్చిన ఒక గేదె బెదిరిపోయి నిరసనకారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో ఏడాదికిపైగా మూతపడిన ప్రైవేట్ స్కూళ్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ స్కూళ్ల సంఘానికి చెందిన కొందరు శుక్రవారం సమావేశమయ్యారు. తమ నిరసనను ప్రభుత్వానికి వినూత్నంగా తెలిపేందుకు ఒక గేదెను తెచ్చారు. దాని ముందు సన్నాయి వాయించడంతోపాటు ఫొటో దిగేందుకు ప్రయత్నించారు.
అయితే బెదిరిపోయిన ఆ గేదె నిరసనకారులపైకి దూసుకెళ్లింది. కొమ్ములతో పొడవడంతో ఒక మహిళకు గాయాలయ్యాయి. కొందరు అతి కష్టం మీద ఆ గేదెను అదుపుచేశారు. అనంతరం ప్రైవేట్ స్కూళ్ల సంఘానికి చెందిన కొందరు సభ్యులు జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. కాగా, నిరసన సందర్భంగా గేదె సృష్టించిన హంగామా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.