Budget Session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం కేంద్రం ఆల్పార్టీ మీటింగ్ నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయ సభలకు చెందిన అన్ని పార్టీల నేతలతో పార్లమెంట్ లైబ్రరీలో సమావేశమయ్యారు. సమావేశంలో 30 పార్టీలకు చెందిన 45 మంది నేతలు పాల్గొన్నారని ప్రహ్లాద్ జోషి తెలిపారు. మెరుగైన వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. 17వ లోక్సభ చివరి సమావేశాలని పేర్కొన్నారు.
ఈ భేటీలో సభ్యుల సస్పెన్షన్ అంశం చర్చకు వచ్చింది. అఖిలపక్ష సమావేశం అనంతరం టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మీడియాతో మాట్లాడారు. 150 మంది ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని సమావేశంలో లేవనెత్తినట్లు తెలిపారు. అయితే, ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేని విధంగా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ఇండియా కూటమిపై ప్రశ్నించగా.. కూటమి ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయ్యిందన్నారు. ఎంపీల సస్పెన్షన్పై ప్రశ్నించగా సస్పెన్షన్లన్నీ రద్దు చేస్తామన్నారు.
లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్తో మాట్లాడినట్లు తెలిపారు. సస్పెండ్ అయిన ఎంపీలందరినీ సభకు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున విన్నవించినట్లు చెప్పారు. దీనికి స్పీకర్, చైర్మన్ అంగీకరించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్-మేలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కార్యక్రమంలో సభ సజావుగా సాగేందుకు విపక్షాల నుంచి సహకారం అందించాలని కోరారు.