న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ బడ్జెట్ ధనవంతులకు మాత్రమేనని, ఇందులో పేదలకు ఏమీ లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. మహాభారతంతో పోల్చితే.. ఇది అర్జునుడు, ద్రోణాచార్యుల బడ్జెట్ అని, ఏకలవ్యది కాదని అన్నారు. బడ్జెట్లో క్రిప్టోకరెన్సీ గురించి ప్రస్తావించారని తెలిపారు. అయితే దీనిపై ఎటువంటి చట్టం లేదని, ఇంతకు ముందు కూడా చర్చించలేదని అన్నారు. వారి (మోదీ) స్నేహితులకు ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ అని మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఆనంద్ శర్మ కూడా ఈ బడ్జెట్పై పెదవివిరిచారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల నష్టపోతున్న పేద, సామాన్య ప్రజలకు, పన్ను చెల్లింపుదారులకు బడ్జెట్ ఉపశమనం కలిగిస్తుందన్న అంచనాలు నెరవేరలేదన్నారు. సమాజంలో పెరుగుతున్న అసమానతలను కూడా పరిష్కరించలేదని చెప్పారు. ఈ బడ్జెట్ చిన్న పరిశ్రమలకు కూడా ఎలాంటి ఉపశమనం కలిగించలేదని ఆయన విమర్శించారు.