Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను
ప్రకటించారు. ఈ బడ్జెట్లో మహిళలు, యువత, రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో
పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రకటించారు. తొమ్మిది కోట్ల మంది మహిళలతో అనుసంధానమైన 83
లక్షల స్వయం సహాయక బృందాలు కోటి మంది మహిళలను లఖ్పతి దీదీగా మార్చడంలో
సహాయపడ్డాయన్నారు. లఖ్పతి దీదీ లక్ష్యాన్ని రూ.2కోట్ల నుంచి రూ.3కోట్లకు పెంచాలని
నిర్ణయించామన్నారు. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయనున్నట్లు
ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తామన్నారు. పోషకాహారం 2.0 అమలు చేయనున్నట్లు
చెప్పారు. టీకాలు బలోపేతం చేస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లందరినీ ఆయుష్మాన్
భారత్ పథకంలో చేర్చనున్నట్లు వెల్లడించారు.
ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది రైతులు లబ్ధి
పొందారని తెలిపారు. 10 లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించామని, వ్యవసాయ రంగంలో ప్రైవేట్, ప్రభుత్వ
రంగ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. గిడ్డంగులు, ప్రాసెసింగ్ కోసం ఆర్థిక సాయం
అందజేస్తామన్నారు. నూనెగింజల స్వయంసమృద్ధి కోసం కొత్త పథకం తీసుకువస్తామన్నారు. కొత్త
వ్యవసాయ సాంకేతికత, వ్యవసాయ బీమాను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. పాడి రైతుల కోసం రాష్ట్రీయ
డైయిరీ ప్రాసెస్, గోకుల్ మిషన్ వంటి పథకాల ద్వారా సహాయం అందజేస్తామన్నారు. మత్స్య సంపద
పెంచేందుకు కృషి చేస్తామన్నారు. మత్స్య ఉత్పత్తి రెట్టింపు అయ్యిందన్న ఆర్థిక మంత్రి మత్స్య సంపద
యోజన ద్వారా హెక్టారుకు మూడు నుంచి ఐదు టన్నుల వరకు ఉత్పాదకత పెరుగుతుందన్నారు.
కొత్తగా 55లక్షల ఉపాధి అకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఐదు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను
ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్కిల్ ఇండియా మిషన్ కింద దేశంలో 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ
ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు. 54 లక్షల మంది అప్స్కిల్, రీ-స్కిల్డ్గా ఉన్నారని.. దేశంలో కొత్తగా 3వేల ఐటీఐలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా దేశంలో ఏడు ఐఐటీలు, 16 ఐఐఐటీలు, ఏడు ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 390 యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయన్నారు. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం గత
బడ్జెట్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం మార్చి 2025 వరకు
అందుబాటులో ఉంటుంది. గరిష్ఠంగా రూ.2లక్షలను మహిళలు, బాలికల పేరిట 7శాతం వడ్డీ రేటుతో
రెండేళ్లపాటు డిపాజిట్ చేసుకునేందుకు వీలుంటుంది.
దీన్దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఏర్పడిన 81 లక్షల స్వయం
సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. స్వయం
సహాయక బృందాలను విలీనం చేసి, వాటికి ముడిసరుకును అందించడం ద్వారా డిజైన్, నాణ్యత,
బ్రాండింగ్, మార్కెటింగ్లో శిక్షణ ఇచ్చి వాటిని ఉత్పత్తి చేసే సంస్థలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని మూడు కోట్ల మంది మహిళా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.54 వేల కోట్లు జమ అయ్యాయన్నారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బడ్జెట్లో మొత్తం రూ.25,448 కోట్లు కేటాయించారు. లింగ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు రూ.2,23,219 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
రైతుల కోసం వ్యవసాయ యాక్సిలరేటర్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత స్టార్టప్లను ప్రోత్సహిస్తామన్నారు. భారతదేశాన్ని అన్నశ్రీకి గ్లోబల్ హబ్గా మార్చడానికి హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. పశుపోషణ, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమలకు రూ.20 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ రుణాన్ని ప్రకటించారు. అలాగే, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.6,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో మత్స్యకారులు, చేపల విక్రయదారులు, చేపల పెంపకానికి సంబంధించిన చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులకు సరఫరా గొలుసును విస్తరించడంలో
సహాయపడుతుందన్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని 11.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2.2 లక్షల కోట్లు జమ అయ్యాయని పేర్కొన్నారు. అగ్రి టెక్ ఆధారిత అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించేందుకు, అభివృద్ధి చేయడానికి దేశంలోని 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను రూ.2516 కోట్లతో కంప్యూటరీకరించనున్నట్లు తెలిపారు. వికేంద్రీకృత నిల్వ సామర్థ్యాన్ని రైతుల కోసం గోబర్ధన్ పథకం కింద కొత్తగా 500 వేస్ట్ టు వెల్త్ బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. ఈజీఎస్ పథకానికి రూ.25వేలకోట్ల బడ్జెట్ను ప్రకటించారు. అలాగే, సక్షం అంగన్వాడీ అండ్ న్యూట్రిషన్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్, సమగ్ర శిక్షా యోజన, సమర్థ్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.45 వేల కోట్లు కేటాయించారు. వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు వీలుగా 10 వేల బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.