న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి, వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. కోటి ఇండ్లకు సోలార్ విద్యుత్తు అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలోనే ప్రధాన్మంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబం నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా పొందుతుందని, ఏటా కరెంటుపై రూ.18000 వరకు ఆదా చేసుకోవచ్చని వివరించారు. సంప్రదాయేతర ఇంధన వనరులు, వాటి ఉత్పత్తికి తీసుకోనున్న చర్యలను మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ‘రూఫ్టాప్ సోలార్ విద్యుత్తుతో ప్రతి కుటుంబం ఏటా రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మిగులు కరెంటును విద్యుత్తు సంస్థలకు అమ్ముకోవచ్చు. ఈ పథకం ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. సోలార్ విద్యుత్తు ఏర్పాటు, సరఫరా తదితర రంగాల్లో అపారమైన పారిశ్రామిక, ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది’ అని వివరించారు.
2070 నాటికి భారత్ నెట్ జీరో ఎమిషన్ (కర్బన ఉద్గారాలు) స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నదని నిర్మలాసీతారామన్ తెలిపారు. 2030 దేశ మొత్తం ఇంధన వినియోగంలో 50 శాతం సంప్రదాయేతర (సోలార్, పవన, జల, జీవ) ఇంధనాల వినియోగం స్థాయికి చేరాలని నిర్ణయించినట్టు చెప్పారు. చార్జింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలను ప్రోత్సహించటం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను విస్తరిస్తామన్నారు.