న్యూఢిల్లీ: ఈ సారి కేంద్ర బడ్జెట్లో ముఖ్య రంగాలకు ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్), మధ్యాహ్న భోజనం, సబ్సిడీలు, పీఎం కిసాన్ పథకాలకు నిధుల కేటాయింపులు భారీగా తగ్గించింది. గత ఏడాది కేటాయింపుల కన్నా సవరించిన అంచనాలు భారీగా పెరిగినప్పటికీ కొత్త బడ్జెట్లో నిధులు తగ్గించడం గమనార్హం.
గ్రామీణాభివృద్ధి పట్ల కేంద్రం పూర్తి నిర్లక్ష్యం వహించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుత బడ్జెట్లో దాదాపు 13 శాతం నిధుల కోత విధించింది. ముఖ్యంగా కరువు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల జనాభాకు జాతీయ ఎంఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి కల్పిస్తున్నది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో పనులు కోరుతున్న వారు భారీ సంఖ్యలో ఉన్నట్టు ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి మూడింట ఒకవంతు నిధులు తగ్గించారు. గత ఏడాది బడ్జెట్లో ఎంఎన్ఆర్ఈజీఎస్కు సవరించిన అంచనాలు రూ.89,400 కోట్లుగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆశ్చర్యకరంగా క్రితంసారి కేటాయింపుల కంటే రూ.13 వేల కోట్లు కోత విధించింది. సవరించిన అంచనాల కన్నా 32 శాతం తక్కువగా నిధులు కేటాయించింది. గ్రామీణాభివృద్ధి పథకానికి కూడా ప్రభుత్వం కోత పెట్టింది. గత ఏడాది బడ్జెట్లో రూ.2.06 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం రూ.2.43 లక్షల కోట్లుగా పేర్కొంది. అయినప్పటికీ ప్రస్తుత బడ్జెట్లో ఐదువేల కోట్ల వరకు కోత పెట్టింది.
కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల కింద ఇచ్చే సబ్సిడీపై గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్లో 28 శాతం కోత పెట్టారు. అన్ని రకాల సబ్సిడీలకు రూ.4.03 లక్షల కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్లో రూ.3.56 లక్షలు కోట్లు కేటాయించినప్పటికీ అది 58 శాతం పెరిగి రూ.5.62 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ ప్రస్తుత బడ్జెట్లో రూ.1.60 లక్షల కోట్లను తగ్గించారు. ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీలకు భారీగా కోత విధించారు. ఎరువులపై సబ్సిడీని సవరించిన అంచనాల కన్నా రూ.50వేల కోట్ల మేరకు తగ్గించారు. ఇక పెట్రో ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీని రూ.3.5 వేల కోట్ల వరకు కోత విధించారు. ఇతర సబ్సిడీలను రూ.2 వేల కోట్ల మేరకు కోత పెట్టారు.
సర్కారు బడుల్లో పేద విద్యార్థులకు కడుపు నింపుతున్న మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్)కు కూడా నిధుల కేటాయింపులో కోత విధించారు. గత ఏడాది కేటాయింపుల్లో సవరించిన అంచనాలు రూ.12,800 కోట్లుగా పేర్కొన్నప్పటికీ ప్రస్తుత బడ్జెట్లో 11,600 కోట్లు మాత్రమే కేటాయించారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపుకోసం 2018 నుంచి అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి కూడా రూ.8 వేల కోట్లు కోత విధించారు. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను పెంచుతున్నట్టు కూడా ప్రకటించలేదు.
ప్రస్తుత బడ్జెట్లో కేంద్రం విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయింపులు పెంచింది. అయితే క్రితంసారి చేసిన కేటాయింపులనే ఖర్చు చేయలేకపోయిన ప్రభుత్వం ఈ సారి విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకొంది. గత రెండేండ్లలో కొవిడ్ కారణంగా ప్రభుత్వం విద్యపై చేసిన ఖర్చు చాలా తక్కువగా నమోదైంది. అయినప్పటికీ ప్రస్తుత బడ్జెట్లో విద్యకు నిధులు పెంచారు. ఆరోగ్య రంగానికి కూడా క్రితంసారి కంటే ప్రస్తుత బడ్జెట్లో నిధులు పెరిగాయి. గత ఏడాది కొవిడ్ మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ దానిని అదుపుచేసేందుకు ప్రభుత్వం వెచ్చించిన నిధులు నామమాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి రూ.86 వేల కోట్లకు పైగా కేటాయించిన ప్రభుత్వం రూ.77 వేల కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేయగలిగింది.
ఆహార, పౌర సరఫరాల శాఖ బడ్జెట్లో కేంద్రం 30 శాతం కోత విధించింది. ప్రస్తుత బడ్జెట్లో ఈ శాఖకు రూ.2,06,513 కోట్లు కేటాయించింది. ఇది గత ఏడాది సవరించిన బడ్జెట్ అంచనాలు రూ.2,96,303 కోట్ల కన్నా 30 శాతం తక్కువ. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇచ్చే ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను రద్దు చేసిన కేంద్రం ఆహార సబ్సిడీకి కూడా ఈ బడ్జెట్లో దాదాపు రూ.90 వేల కోట్ల మేరకు నిధులు తగ్గించింది. ఆహార సబ్సిడీ కోసం గత ఏడాది రూ.2.06 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. కానీ అంతకుమించి రూ.80 వేల కోట్ల వరకు అధికంగా ఖర్చయినట్టు సవరించిన అంచనాలలో పేర్కొన్నారు.