కోల్కతా: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మానవత్వాన్ని చాటింది. (BSF humanity) మరణించిన భారతీయ తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన కుమార్తెను అనుమతించింది. పశ్చిమ బెంగాల్లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. హరిహర్పూర్ గ్రామానికి చెందిన లియాకత్ బిస్వాస్ వృద్ధాప్యం వల్ల మరణించాడు. ఆయన కుమార్తె, ఇతర బంధువులు బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామంలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిహర్పూర్ గ్రామ పంచాయతీ సభ్యుడు అమీనుద్దీన్ మధుపూర్లోని బోర్డర్ అవుట్ పోస్ట్ వద్ద ఉన్న బీఎస్ఎఫ్ కమాండర్కు ఈ విషయాన్ని తెలిపారు. తండ్రిని చివరిసారి చూసేందుకు బంగ్లాదేశ్ గ్రామంలో ఉన్న కుమార్తెకు అవకాశం కల్పించాలని కోరారు.
కాగా, బీఎస్ఎఫ్ అధికారులు వెంటనే స్పందించారు. బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ (బీజీబీ)తో సంప్రదింపులు జరిపారు. వారు కూడా సానుకూలంగా వ్యవహరించి ఏర్పాట్లు చేసింది. దీంతో బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామంలో నివసిస్తున్న మహిళ, తన బంధువులతో కలిసి అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతానికి చేరుకుంది. అక్కడకు తీసుకువచ్చిన తండ్రి దేహాన్ని కడసారి చూసి నివాళి అర్పించింది.
మరోవైపు సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్లోని బీఎస్ఎఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఈ విషయాన్ని తెలిపారు. సరిహద్దు దళాలు దేశ భద్రతకే కాకుండా సరిహద్దు నివాసితుల సంతోషం, దుఃఖంలో కూడా భాగమవుతాయని చెప్పారు. సరిహద్దు ప్రజల మత, సామాజిక విలువలను జాగ్రత్తగా కాపాడతాయని అన్నారు. అక్రమాలకు పాల్పడే వారికి మాత్రమే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వ్యతిరేకమని తెలిపారు. అయితే మానవత్వం, మానవీయ విలువల విషయంలో బీఎస్ఎఫ్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని స్పష్టం చేశారు.