న్యూఢిల్లీ, జూలై 21 (నమస్తే తెలంగాణ): మణిపూర్లో జరుగుతున్న అమానవీయ, హింసాత్మక సంఘటనలపై కేంద్రం స్పందించాలని, పార్లమెంట్లో చర్చించి అక్కడి ప్రజలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో రెండోరోజైన శుక్రవారం కూడా మణిపూర్ ఘటనలపై బీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ అందుకు తిరస్కరించడంతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో ఉభయసభలను స్తంభింపజేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. 80 రోజులుగా మణిపూర్లో జరుగుతున్న హింసపై చర్చించి, ప్రధాని మోదీ నోరు విప్పి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మణిపూర్ దారుణంపై యావత్ ప్రపంచం స్పందిస్తున్నా కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్లో చోటుచేసుకున్న దుర్మార్గ, నీతిబాహ్యమైన ఉదంతాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మణిపూర్ ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండేందుకు పార్లమెంట్ దేశ ప్రజలకు స్పష్టమైన ఆశ్వాసన ఇవ్వాలని పట్టుబట్టారు. ఉభయసభల్లో బీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నినాదాలతో ఇతర పార్టీల నేతలు గొంతు కలిపారు. దీంతో ఉభయసభలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాగానే మళ్లీ బీఆర్ఎస్ ఎంపీలు సభలో నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళం మధ్య ప్యానల్ స్పీకర్ సభను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
మణిపూర్ అంశంపై చర్చకు అనుమతించకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకిపోతున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. రెండు రోజులుగా సభలో వాయిదా తీర్మానం ఇస్తున్నా కేంద్రం పట్టించుకోకుండా కావాలని తప్పించుకుంటుందని మండిపడ్డారు. ప్రజలకు ఎకడ వాస్తవాలు చెప్పాల్సి వస్తుందోననే భయంతోనే కేంద్రం చర్చ జరపకుండా వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నదని విమర్శించారు. మణిపూర్ రావణకాష్టంలా మారినా కేంద్రానికి చీమ కుట్టినట్టు అయినా లేకపోవడం తీవ్రంగా కలచివేస్తున్నదని పేర్కొన్నారు. మణిపూర్ అల్లర్లపై చర్చించి, చర్యలు తీసుకునే వరకు కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
మణిపూర్ పరిణామాలు దేశ సార్వభౌమ, సౌభ్రాతృత్వ వ్యవస్థకు కళంకం అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి ఘోరమైన ఉదంతాలను వినలేదని చెప్పారు. ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్టను దిగజార్చేవిధంగా ఉన్నదని, కేంద్రంలో అమానవీయ పాలన సాగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంత దారుణమైన అంశంపై చర్చించడం కన్నా అతి ముఖ్యమైన అంశం ఏమి ఉంటుందని ప్రశ్నించారు.
మణిపూర్లో మరణోహోమం జరుగుతుంటే.. ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న జీ కిషన్రెడ్డి ఆ విషయాన్ని వదిలేసి, హైదరాబాద్లో రాజకీయం చేస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని తెలంగాణభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ హింసాకాండ జరుగుతుంటే మంత్రి కిషన్రెడ్డి ఎందుకు పార్లమెంట్కు రావడం లేదని ప్రశ్నించారు. మంత్రిగా కిషన్రెడ్డి ఈశాన్య రాష్ర్టాల బాధ్యతలను విస్మరించి తెలంగాణ రాష్ర్టాన్ని ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నుంచి ఎలా కాపాడుకోవాలా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ తలమునకలై ఉంటే.. కిషన్రెడ్డి మాత్రం అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతూ పరిపాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఎంపీలు అంతా కలిసి పోరాడుతామని చెప్పారు.