న్యూఢిల్లీ : ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రేపు మధ్యాహ్నం 12:47 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కేంద్ర కార్యాలయంలో మొదట కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం కార్యాలయం ప్రారంభోత్సవం చేసి, కేసీఆర్ తన గదిలో కూర్చుంటారు. ఈ విషయాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా హాజరు కానున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్తో భావసారూప్యం కలిగిన జాతీయ నాయకులను ఆహ్వానించామని చెప్పారు.
దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఢిల్లీలో రాజశ్యామల యాగం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 11 గంటలకు 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. యాగ నిర్వహణ కోసం వారు సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి.