BRS Party | ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ కలిసివస్తున్నాయి. బీఆర్ఎస్తో కలిసి పని చేసేందుకు మహిళలు సైతం కలిసివస్తున్నారు. ఈ క్రమంలో మహిళా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ మహిళా సంఘం ‘స్వరాజ్య మహిళా సంఘటన’ భారత్ రాష్ట్ర సమితిలో విలీనమైంది. హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమక్షంలో స్వరాజ్య మహిళా అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే పార్టీలో విలీనం చేశారు. వారికి సీఎం కేసీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా స్వరాజ్య మహిళా సంఘటన అధ్యక్షురాలు వనితా తాయిగుట్టే మాట్లాడుతూ తెలంగాణలో మహిళా అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విధానాలు మహారాష్ట్ర నారీ లోకాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. సమాజంలోని పేదలు, పీడితులు, అసహాయులు, వితంతువుల సంక్షేమం, స్వావలంబన కోసం పనిచేస్తున్న స్వరాజ్య మహిళా సంఘటన ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని లక్ష్యంతో విలీన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ విధానాలను ముందుకు తీసుకుపోవడంలో పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలను చిత్తుశుద్ధితో పాటిస్తానని వనితా తాయి పేర్కొన్నారు. జీవితాంతం బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

స్వరాజ్య మహిళా సంఘటనతో పాటు మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నాయకులు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు శంకర్న ధోండ్గే నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. బుల్ధానా జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ వాంఖడే, స్టేట్ యూనియన్ వర్కర్ (సభ్యుడు) రామ్ రావ్ షిండే పాటిల్, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భయ్యా సాహెబ్ పాటిల్, పంచాయతీ సమితి సభాపతి సురేష్ మిస్రవ్, శంభాజీ బ్రిగేడ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మొహాలే, కార్పోరేటర్, ఎన్సీపీ పార్టీ తాలూకా ప్రెసిడెంట్ జయంత్ చౌదరి, మహిళా అఘాడీకి చెందిన మనిషా చౌదరి, మహాగావ్ తాలూకా సభాపతి నరేంద్ర ఖదారే, శివసేన జిల్లా సచివ్ దత్తరాజ్ దేశ్ ముఖ్, లాహురావ్ మడ్కే, అషిప్ యాతల్, సునీల్ జాదవ్, సంతోష్ రాథోడ్ పార్టీలో చేరారు.