హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): మణిపూర్ ఘటనపై చర్చకు బీఆర్ఎస్ పట్టువిడువకుండా పోరాడుతున్నది. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై అత్యవసరంగా రాజ్యసభ, లోక్సభలో చర్చ జరిపి, శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొల్పేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ రాజ్యసభ, లోక్సభా పక్ష నాయకులు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు శుక్రవారం వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
డెంటల్ కమిషన్ బిల్లు-2020 బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించాలని నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై దంత ప్రొఫెషనల్ సంస్థలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని, వాటి పరిశీలనకు, చర్చించడానికి ముందుగా బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు.
గత ఐదేండ్లలో తెలంగాణ నుంచి కేవలం 79 మందిని మాత్రమే కేంద్ర నోటరీలుగా నియమించి, వివక్ష చూపించారని నామా నాగేశ్వరరావు కేంద్రంపై ధ్వజమెత్తారు. తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం వద్ద 1,969 నోటరీల దరఖాస్తులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని ప్రశ్నించారు. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ స్పందిస్తూ నోటరీ దరఖాస్తులు పెండింగ్లో ఉన్న సంగతి వాస్తవమేనని అంగీకరించారు. సెంట్రల్ నోటరీల నియామక ప్రక్రియకు నిర్దిష్ట కాల పరిమితి సూచించలేమని పేర్కొన్నారు.
లోక్సభలో పలు బిల్లులను మూజవాణి ఓటుతో ప్రభుత్వం ఆమోదించుకొన్నది. ఇందులో కీలకమైన ది మైన్స్ అండ్ మినరల్స్(డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్)-2023 ఉన్నది. ఈ బిల్లు ఆమోదం ద్వారా లిథియంతోపాటు బెరిలీయం, నియోబియం, టైటానియం, టైలాలం, జిర్కోనియమ్ ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్ అనుమతుల ప్రైవేటు రంగ సంస్థలకు కూడా దక్కుతాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ తేదీని స్పీకర్ సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షాల అవిశ్వాసంపై సమాధానం ఇవ్వాల్సిన ప్రధాని మోదీ.. మంగళవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారని, తీర్మానంపై బుధ, గురువారాల్లో చర్చ, ఓటింగ్ జరుగుతుందని లోక్సభ వర్గాలు తెలిపాయి.