Loksabha | న్యూఢిల్లీ : తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆదాయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించగా, ఈ ప్రాజెక్టుకు రూ. 86 వేల కోట్లు ఇచ్చామని కేంద్రం చెప్పడం దారుణం అని మండిపడ్డారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగామని ఎంపీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నో సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కూడా అడిగారు. కానీ ఒక్క నయాపైసా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇవ్వలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 86 వేల కోట్లు ఇచ్చామని సభలో అబద్ధాలు చెప్పడం దారుణం. బీజేపీ సోషల్ మీడియాలో అబద్దాలు మాట్లాడినట్లు.. సభలో కూడా అబద్దాలు మాట్లాడింది. అసలు రూ. 86 వేల కోట్లు ఎప్పుడు ఇచ్చారో సమాధానం చెప్పాలని కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవాళ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా చూస్తోందని ఎంపీ తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, అధికారులు తెలంగాణ అభివృద్ధిని పరిశీలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసించి, ఆయా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు. కేసీఆర్ గొప్పగా చేస్తున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు. ఇంత గొప్ప ప్రాజెక్టు కడితే బీజేపీ ఏనాడూ సహాయం చేయలేదు. ఈ ప్రాజెక్టుపై ఎప్పుడు మాట్లాడలేదు. అన్ని డిపార్ట్మెంట్లలో తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.