రెంజల్, మే 26: మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి సభ్యత్వాల నమోదుకు విశేష స్పందన లభిస్తున్నది. నాందేడ్ జిల్లా నాయ గాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత బాబురావ్ కదం ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యత్వ నమోదు ప్రారంభించారు. అంతకుముందు ధర్మాబాద్ తాలూకా సంగెం గ్రామంలోని శివాలయంలో పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ఈ క్రమంలో అభిమానులు, ప్రజలు తొలిరోజే ఉత్సాహంగా సభ్యత్వం తీసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ముందుకు వస్తున్నట్టు నియోజకవర్గ నాయకుడు బాబురావ్ కదం తెలిపారు. 189 గ్రామాల్లో నెలపాటు ఇంటింటికి తిరుగుతూ పథకాలను వివరించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వినాయక్ షిండే, దత్తమోరే, నవీన్పాటిల్, ధన్రాజ్ కదం తదితరులు పాల్గొన్నారు.