Telangana | ముంబై, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు మహారాష్ట్రలో కూడా కొనసాగుతున్నది. తెలుగువారు ఎకువగా ఉండే ముంబై, థానే, భీవండి, నవీముంబై, ఫుణె ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్సహా కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ గ్రామాలకు చెందిన ఓటర్లు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో, జాబితా రూపొందించుకొని వారికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు స్వగ్రామానికి వచ్చి, ఓటు హకు వినియోగించుకోవాలని కోరుతున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా ఓటర్లను తరలించారు. కొందరు ఓటర్లకు రానుపోను రైలు చార్జీలతోపాటు భోజన వసతి కల్పించారు. ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి మరికొందరు ప్రత్యేక బస్సులు పెట్టారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండపాటు ఉమ్మడి మహబుబ్నగర్ జిల్లాల ప్రజలు మహారాష్ట్రలో చాలా పట్టణాల్లో స్థిరపడ్డారు. వీరందరికీ సొంత గ్రామాల్లో కూడా ఓటు హకు ఉన్నది. అభ్యర్థుల తరఫున నాయకులు పోటీ పడి తమ ఓటర్లను గ్రామాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సమన్వయకర్తలను గతంలోనే నియమించారు. సుశిక్షితులైన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్కు అక్కడ ఉన్నారు. ఇటీవల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్థానిక నేతలు థానే, ఫుణెల్లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పట్నం మహేందర్రెడ్డితోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. రెండు చోట్ల జరిగిన సభలకు ప్రజలు కూడా పెద్దసంఖ్యలో వచ్చారు. సొంత ఖర్చులతో ఊరికి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి ఓటు గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.