హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం, అదానీ వ్యవహరంపై జేపీసీ ఏర్పాటు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల తదితర అంశాలను ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించనున్నారు.
మొదటి విడత సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ ఎంపీలు.. ఈసారి కూడా అదేరీతిలో కలిసి వచ్చే ఇతర పార్టీల సభ్యులతో కేంద్రాన్ని నిలదీయాలని, నిరసన తెలిపాలని, కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం చేయాలని నిర్ణయించారు. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదింపజేసుకోవడమే తమ ప్రాధాన్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది.
కార్యాచరణ సిద్ధం
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావులు ఆదివారం సమావేశమై చర్చించారు. కార్యాచరణను ఖరారు చేశారు. ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజా సమస్యలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సహా అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు పోరాడాలని నిర్ణయించారు.
మాట్లాడే అవకాశం ఇవ్వాలి: కేకే
రాజ్యసభపక్ష నాయకులతో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభా సజావుగా జరగాలంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని, ప్రజల ఆకాంక్షలను సభ ముందు ఉంచుతామని, అందుకు ఆవకాశం కల్పించాలన్నారు. కాగా, విపక్ష నేతలపైకి సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుండటంపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. అదానీ అక్రమాల కారణంగా ఎల్ఐసీ, ఎస్బీఐ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు ధరల పెరుగుదల, నిరుద్యోగం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్ పేర్కొన్నారు. రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయి.