న్యూఢిల్లీ, మే 10: బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులకు ఒకే రకమైన యూనిఫాంను అమలు చేయాలని భారత ఆర్మీ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు తాజాగా జరిగిన కమాండర్ స్థాయి సమగ్ర సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తలపాగా, బ్యాడ్జీలు, ప్యాచెస్, బూట్లు, బెల్టులు ఇకపై అందరికీ ఒకేలా ఉండనున్నాయి. ఫ్లాగ్ ర్యాంక్ అధికారులు ఇకపై లాన్యార్డ్స్ (భుజానికి ఉండే పట్టీ) ధరించరు. కల్నల్, కింది స్థాయి అధికారుల యూనిఫామ్లో ఎటువంటి మార్పు ఉండదు. భారత ఆర్మీ నిజమైన నైతికతను ఈ కామన్ యూనిఫాం ప్రతిబింబిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులు మేజర్ జనరల్, లెఫ్ట్నెంట్ జనరల్, జనరల్ మధ్య ఇకపై రెజిమెంటేషన్ హద్దులు ఉండవు.