Gujarat | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): బీజేపీపాలిత గుజరాత్లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జి కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు. బనస్కాంత జిల్లా పాలన్పుర్లో సోమవారం ఈ ఘటన జరిగింది. పాలన్పుర్-అంబాజీని కలిపేందుకు నిర్మిస్తున్న ఈ వంతెన కోసం వారం క్రితమే ఆరు కాంక్రీటు స్లాబులు నిర్మించారు. సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆటోలో వంతెన కింది నుంచి వస్తున్నాడు.
ఇంతలో స్లాబులు పడిపోవడం గమనించిన అతను.. ఆటోను వదిలి, ప్రాణాలు కాపాడుకొనేందుకు పరిగెత్తాడు. కానీ, ఆలస్యమవ్వడంతో శిథిలాల కింద నలిగిపోయి, ప్రాణాలు విడిచాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. శిథిలాల కింద చిక్కుకొని మరొకరు కూడా మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల వేసిన స్లాబులు కూలిపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్టు కలెక్టర్ వరుణ్కుమార్ బరన్వాల్ తెలిపారు. కాగా గత అక్టోబర్లో గుజరాత్లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనలో 135 మంది మరణించడం తెలిసిందే.
రెండు నెలలకో బ్రిడ్జి.. ఇటీవల కూలిన కొన్ని వంతెనలు
డిసెంబర్, 2021: మమతాపుర్ బ్రిడ్జ్జి, అహ్మదాబాద్
ఆగస్టు, 2022: హట్కేశ్వర్ బ్రిడ్జి, అహ్మదాబాద్
అక్టోబర్, 2022: మోర్బీ బ్రిడ్జి, మోర్బీ
డిసెంబర్, 2022: అటల్ బ్రిడ్జి, వడోదరా
జూన్, 2023: రైల్వే ఓవర్బ్రిడ్జి, వల్సాద్
జూన్, 2023: మిందోలా బ్రిడ్జ్జి, తపీ
జూన్, 2023: వరియావ్ బ్రిడ్జి, సూరత్
జూన్, 2023: శాస్త్రీ బ్రిడ్జి, అహ్మదాబాద్
సెప్టెంబర్, 2023: బస్తాదీ బ్రిడ్జి, బస్తాదీ
అక్టోబర్ 2023: పాలన్పుర్ బ్రిడ్జ్జి, పాలన్పుర్