అహ్మదాబాద్: ఒక వంతెన కూలడంతో పలు వాహనాలు నదిలో పడ్డాయి. ఈ సంఘటనలో కొందరు వ్యక్తులు గల్లంతయ్యారు. నలుగురిని రక్షించగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు. (bridge collapses in Gujarat) గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం వస్తాడి ప్రాంతంలో నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో బ్రిడ్జీ పైనుంచి వెళ్తున్న పలు వాహనాలు నదిలో పడ్డాయి. సుమారు పది మంది కొట్టుకుపోతుండగా నలుగురిని రక్షించారు. గల్లంతైన మిగతా వారి కోసం ఆ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, చురా పట్టణానికి జాతీయ రహదారిని కలిపే వంతెన కూలిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ప్రభుత్వ అధికారులు హడావుడిగా అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన సుమారు 40 ఏళ్ల నాటి పురాతన వంతెనపైకి భారీ వాహనాల రాకపోకలను నిషేధించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే వంతెన పైనుంచి వెళ్లేందుకు డంపర్ ప్రయత్నించడంతో అది కూలినట్లు చెప్పారు. కొత్త వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదలను సంబంధిత శాఖకు పంపినట్లు వెల్లడించారు.