లక్నో : కోటి ఆశలతో కొత్త జీవితాన్ని స్వాగతించాల్సిన వేళ పెండ్లి వేడుకలోనే వధువు కుప్పకూలడంతో అక్కడున్న వారంతా విషాదంలో మునిగిపోయారు. పెండ్లి వేదికపై వధూవరులు దండులు మార్చుకునే సమయంలో గుండెపోటుకు గురైన పెండ్లి కూతురు వేదికపైనే కుప్పకూలింది.
లక్నో శివార్లలోని భద్వానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వధువు గుండెపోటుతో పెండ్లి మండపంపై మరణించిన ఘటన సోషల్ మీడియాలో తెలిసిందని, దర్యాప్తు నిమిత్తం పోలీసులను ఘటనా ప్రాంతానికి పంపామని మలిహాబాద్ స్టేషన్ అధికారి సుభాస్ చంద్ర సరోజ్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్వానా గరామానికి చెందిన రాజ్పాల్ కూతులు శివాంగికి వివేక్తో వివాహం జరుగుతుండగా వధువు వేదికపైకి చేరుకుని పెండ్లి కొడుకుకు దండం వేసేందుకు ప్రయత్నిస్తూ స్టేజ్పైనే కుప్పకూలింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించింది. గుండెపోటుతోనే శివాంగి మరణించిందని వైద్యులు నిర్ధారించారు.