రియో డీ జెనీరో: పహల్గాం ఉగ్ర దాడిని (Pahalgam Terror Attack) బ్రిక్స్ దేశాలు (BRICS) తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు బ్రెజిల్లోని రియో డీ జెనీరలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ‘రియో డీ జెనీరో డిక్లరేషన్’ను సభ్యదేశాలు విడుదల చేశాయి. ‘ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తున్నాం. క్రాస్ బార్డర్ టెర్రిరిజంతోపాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ, ఆశ్రయం కల్పించడాన్ని ఖండిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అందులో పేర్కొన్నాయి. అయితే ఈ తీర్మానంలో ఎక్కడా పాకిస్థాన్ పేరు ప్రస్థావించలేదు.
మరోవైపు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా భారత్కు స్థానం కల్పించాలని బ్రిక్స్ కూటమి డిమాండ్ చేసింది. భద్రతా మండలిని సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భారత్, బ్రెజిల్కు భద్రతా మండలిలో మరింత ప్రాధాన్యం కలిగి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు సభ్యత్వంలో మెరుగైనా ప్రాతినిధ్యం కల్పించాలని అభిప్రాయపడింది. అదేవిధంగా ప్రపంచ వాణిజ్యంలో ఏకపక్ష ఆంక్షలు, అధిక టారీఫ్లు, రక్షణాత్మక చర్యలపై బ్రిక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చులు పెరగడం, విభజన ధోరణి మంచిదికాదని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత బలోపేతానికి రాజకీయ, శాస్త్రీయ పరిష్కారాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది.