తుంగతుర్తి, మే 3 : ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీరు పంపిణీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్ అన్నారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆదేశాల మేరకు సమావేశాలు నిర్వహించి ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీరు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని సర్పంచులను, అధికారులను కోరారు. సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మి, డీటీ పుష్ప, సర్పంచులు నల్లు రాంచంద్రారెడ్డి, పద్మ, యాకునాయక్, వెంకన్న, వీరోజి, గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.
పెన్పహాడ్ : సమైక్య పాలనలో తాగునీటి కోసం ఆడబిడ్డలు సిగపట్లు పట్టేవారిని, తెలంగాణ రాష్ట్రంలో అవి కనిపించకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకం చేపట్టారని ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితా అంజయ్య పేర్కొన్నారు.
సోమవారం మండల కేద్రంలో సర్పంచులు, కార్యదర్శులకు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల గ్రామాల్లో మంచినీటి ఎద్దడి రావద్దనే ఉద్దేశంతో మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాల మేరకు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం విజయవంతం చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఎంతో ఉందన్నారు. మండలంలోని ప్రతి గడపకు స్వచ్ఛమైన గోదావరి నీళ్లు చేరేలా చూడాలన్నారు. ప్రతి ఇంటికీ నీరు అందినప్పుడే గ్రామాల్లోని పీడబ్ల్యూఎస్ మోటర్లు బంద్ అయ్యి గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు రావని తెలిపారు. గ్రామాల్లో అసంపూర్తిగా మిగిలిన మిషన్ భగీరథ పైపులైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలోపీఏసీఎస్ చైర్మన్ నాతాల జానకీరాంరెడ్డి, తాసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీఓ బాణాల శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.