అహ్మదాబాద్, మే 3: ఒకప్పుడు మద్యం, పొగతాగడాన్ని వ్యసనాలుగా భావించేవారు. ఆ తరువాత మత్తుమందులు (డ్రగ్స్) ఆ స్థానాన్ని ఆక్రమించాయి. ఇప్పుడు సెల్ఫోన్కు అందులోని సామాజిక మాధ్యమాలకు యువత బానిసలుగా మారుతున్నారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల దాకా అందరికీ సెల్ఫోన్ తమ శరీరంలో ఒక అవయవంలా మారిపోయింది. కొద్దిసేపు ఫోన్ తమ వద్ద లేకపోతే పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యసనం ప్రాణాంతకంగా మారుతున్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా సెల్ఫోన్ను వ్యసనంగా మార్చుకొన్న వారిని కాపాడుకొనేందుకు, వారి నుంచి ఇతరులను కాపాడేందుకు అహ్మదాబాద్లో కొన్ని కుటుంబాలు బౌన్సర్లను నియమించుకున్నాయి.
తమ 16 ఏండ్ల కుమార్తెను 24×7 నిఘా వేసేందుకు ఓ కుటుంబం రెండు షిఫ్టుల్లో నలుగురు బౌన్సర్లను నియమించింది. వీరి సేవలకు గాను నెలకు రూ.65 వేలు చెల్లిస్తున్నది. ఆ బాలిక సెల్ఫోన్కు, సోషల్ మీడియాకు బానిసగా మారిందని సైకియాట్రిస్ట్ డాక్టర్ మురుగేశ్ వైష్ణవ్ చెప్పారు. ఫొటోలు పంచుకొనే మాధ్యమానికి ఆమె బానిసగా మారిందని, అలా ఫొటోలు షేర్ చేసిన వారిని కలిసేందుకు ఏ సమయంలోనైనా వెళ్లిపోతుందని తెలిపారు. సెల్ఫోన్ను ఆమె నుంచి తొలగిస్తే హింసాత్మకంగా మారుతుందని అన్నారు. ఆమె రక్షణ కోసమే బౌన్సర్లను ఏర్పాటుచేసినట్టు తల్లిదండ్రులు చెప్పారు.
సూరత్లో తమ 17 ఏండ్ల కుమారుడి నుంచి పెంపుడు కుక్కను కాపాడుకొనేందుకు ఓ కుటుంబం బౌన్సర్లను నియమించుకుంది. ఆ కుక్కను కాపాడేందుకు తొమ్మిది నెలలపాటు ఎనిమిది మంది బౌన్సర్లను రెండు షిఫ్టుల్లో మోహరించామని ఫోర్స్-11 సెక్యూరిటీ కంపెనీ అధిపతి నిఖిల్ పాండే తెలిపారు. ఆ టీనేజర్ సెల్ఫోన్లో గేమ్స్కు బానిసగా మారాడు. తండ్రి తనను మందలించిన ప్రతిసారీ ఆ బాలుడు తన కోపాన్నంతా తమ పెంపుడు కుక్కపై చూపేవాడని పాండే చెప్పారు.
వ్యసనాలకు బానిసలైన యువతకు రక్షణ కల్పించే కొత్త బాధ్యతను ఇటీవల సెక్యూరిటీ ఏజెన్సీలకు అందిస్తున్నారని సూరత్కు చెందిన యాసిన్ మాలిక్ చెప్పారు. మాదకద్రవ్యాలకు బానిసైన తమ కుమారుడికి వైద్య చికిత్స అందించిన అనంతరం అతనికి తోడుగా ఉండేందుకు తమ సంస్థను ఆశ్రయించారని తెలిపారు. ఆ యువకుడు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకుండా, మళ్లీ మత్తు మందుల జోలికి పోకుండా చూడటం తమకు అప్పగించిన బాధ్యత అని అన్నారు.
ఇందుకోసం ఒక బౌన్సర్కు రోజుకు రూ.1,500 చెల్లిస్తున్నారని చెప్పారు. సెల్ఫోన్ స్క్రీన్కు బానిసలైన పిల్లలు, యువత కేసులు కొవిడ్ అనంతర కాలంలో ఎక్కువయ్యాయని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ వైష్ణవ్ చెప్పారు. చదువు కోసం సెల్ఫోన్ను పొందుతున్న విద్యార్థులు ఇతర అంశాలపైకి తమ దృష్టిని మరలిస్తున్నారని అన్నారు. డ్రగ్స్, మద్యం లాగా ఇది కూడా ఒక కొత్త రకం వ్యసనంగా మారిందని చెప్పారు.