న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. 15-18 ఏండ్ల వయసున్న వారికి జనవరి 3 నుంచి కరోనా టీకా వేస్తామని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రకటించారు. ఆరోగ్య కార్యకర్తలకు జనవరి 10 నుంచి బూస్టర్ డోసు వేస్తామన్నారు. అయితే దాన్ని ఆయన బూస్టర్ డోసు అనకుండా ‘ముందు జాగ్రత్త డోసు’గా పేర్కొన్నారు. జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు కూడా వైద్యుల సలహాతో బూస్టర్ డోసును 10వ తేదీ నుంచే ఇస్తామని పేర్కొన్నారు. చికిత్స కన్నా నివారణ మేలని చెప్పారు. మాస్కులు వాడటం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.