ముంబై: మహారాష్ట్ర (Maharashtra )లో శివసేన విభజన చిచ్చు పలు మలుపులు తిరుగుతున్నది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ అనర్హత వేటు వేయకుండా నిర్ణయం తీసుకోవడాన్ని సీఎం ఏక్నాథ్ షిండే వర్గం తాజాగా బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. షిండే నేతృత్వంలోని శివసేన చీఫ్ విప్ భరత్షెట్ గోగావాలే పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 12న శివసేన ఇరు వర్గాల అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. షిండే వర్గమే అసలైన శివసేనగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడాన్ని షిండే వర్గం ప్రశ్నించింది. స్పీకర్ ఆర్డర్ చట్టపరంగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించింది. స్పీకర్ తీర్పును రద్దు చేయాలని, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బాంబే హైకోర్టును కోరింది.
కాగా, న్యాయమూర్తులు గిరీష్ కులకర్ణి, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పరిశీలించింది. ప్రతివాదులైన స్పీకర్, ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన ఎమ్మెల్యేలు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కు వాయిదా వేసింది. మరోవైపు స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీర్పును సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.