ముంబై : ఇంటి పని చేయమని అత్తింటి వారు భార్యను అడిగారంటే ఆమెను పనిమనిషిగా చూస్తున్నారని అర్ధం కాదని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండ్లయిన తర్వాత ఇంటి పని చేయడం మహిళకు ఇష్టం లేకుంటే ఆ విషయాన్ని ఆమె ముందే తెలియచేస్తే వివాహ విషయంలో పునరాలోచనకు అవకాశం ఉంటుందని పేర్కొంది. పెండ్లయిన నెల రోజుల తర్వాత నుంచి తనను పనిమనిషిగా చూస్తున్నారని భర్త, అత్త, వదినపై ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
వివాహితను ఇంటి పని చేయాలని కోరారంటే అది కచ్చితంగా కుటుంబం కోసమేనని, మహిళను పనిమనిషిగా చూస్తున్నారని అనడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. అత్తవారింట్లో బట్టలు, వంటపాత్రలను శుభ్రం చేయడం వంటి పనులు చేసేందుకు సర్వెంట్ ఉన్నారా అనే విషయంలో ఎఫ్ఐఆర్లో ఎలాంటి వివరాలు పొందుపరచలేదని బెంచ్ ప్రస్తావించింది. నిందితుడు కారు కొనుగోలు చేసేందుకు తమను రూ 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని కూడా భార్య ఆరోపించింది. అంత డబ్బు తమ వద్ద లేదని తన తండ్రి చెప్పడంతో తనను మానసికంగా, శారీరకంగా వేధించారని ఆమె ఆరోపించింది.
కొడుకును కనాలని అత్త, వదిన తనను చిత్రహింసలు పెట్టారని ఆమె ఆరోపణలు గుప్పించింది. అయితే బ్యాంక్ లోన్ ద్వారా అతడు కారు కొనుగోలు చేశాడని, ఆమెను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని నిందితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. మొదటి వివాహానికి సంబంధించి కూడా మహిళ ఇవే తరహా ఫిర్యాదులు చేసిందని ఆయన కోర్టుకు నివేదించారు. నిందితులపై మహిళ చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.