ముంబై: దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగానే ముంబైలో కూడా క్రమంగా వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ముంబై వాసులకు కీలక హెచ్చరిక చేసింది. దీపావళికి ఎడాపెడా పటాకులు కాల్చి నగర వాతావరణాన్ని ఢిల్లీలా మార్చవద్దని హెచ్చరించింది. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చే సమయ పరిమితిని కూడా కోర్టు మరింత కుదించింది.
ముంబైలో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతున్న నేపథ్యంలో.. దీపావళి సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు గంటలు మాత్రమే పటాకులు కాల్చాలని ఈ నెల 6న బాంబే హైకోర్టు పరిమితులు విధించింది. అయితే కాలుష్య తీవ్రత ఎక్కువ అవుతుండటంతో కోర్టు ఆ కాల పరిమితిని మరింత కుదించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రెండు గంటలు మాత్రమే పటాకులు కాల్చేందుకు అనుమతించింది.
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ జీఎస్ కుల్కర్ణి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ సందర్భంగా ముంబై వాసులను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీలా మారొద్దు. ముంబైకర్లుగానే ఉండండి’ అని వ్యాఖ్యానించింది. ముంబైలో వాయు నాణ్యత మరింత క్షీణిస్తున్నదని వ్యాఖ్యానించింది. ముంబై కూడా ఢిల్లీలా మారకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.