Bomb Threat | లక్నో : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలోని రామ్ జానకి టెంపుల్ను బాంబులతో పేల్చేస్తామని పోస్టర్లు వెలిశాయి. అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన ఆరు రోజుల తర్వాత రామ్ జానకి టెంపుల్ను పేల్చేస్తామని పోస్టర్లు వెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆ ఆలయం గోడలపై పోస్టర్లు వెలియడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా బీజేపీ లీడర్ రోహిత్ సాహును కూడా చంపుతామని హెచ్చరించారు. రామ్ జానకి టెంపుల్ ట్రస్టీగా రోహిత్ కొనసాగుతున్నారు.
ఈ సందర్భంగా రోహిత్ సాహు సోదరుడు రాహుల్ సాహు మాట్లాడుతూ.. ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని వాల్ పోస్టర్లు వెలిశాయని ఈ ఉదయం తనకు సమాచారం అందింందన్నారు. తాను అక్కడికి వెళ్లి చూడగా ఆలయంలో బెదిరింపు పోస్టర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిని చూసి భయమేసిందన్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆలయం తలుపులు మూసి, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు రాహుల్ సాహు తెలిపారు.
ఈ బాంబు బెదిరింపు పోస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భక్తులు అటు వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.