కోల్కతా : బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కోల్కతాతో పాటు చుట్టు పక్కల ఉన్న నగరాల్లో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇప్పటి వరకు రెండు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. వార్డు 36లోని సీల్దాలో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఓటు వేసేందుకు వచ్చిన ముగ్గురు ఓటర్లకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. టాకీ బాయ్స్ స్కూల్ వద్ద జరిగిన బాంబు పేలుడులో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం పోలీసుల నుంచి నివేదిక కోరింది. బాంబు పేల్చిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.