న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: వార్తలకు కొన్ని మాధ్యమాలు మతం రంగు పులుముతుండటం దేశానికి చెడ్డపేరు తెస్తున్నదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెబ్ పోర్టళ్లు, యూట్యూబ్తో పాటు సోషల్ మీడియాలో బోగస్ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. సోషల్ మీడియా ‘శక్తిమంతమైన వ్యక్తుల గొంతుకల’ను మాత్రమే వింటుందని, జడ్జిలను, వ్యవస్థలను వినిపించుకోదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. గత ఏడాది తబ్లిగీ జమాత్ గురించి బోగస్ వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని, వాటికి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరుతూ జమియత్ ఉలేమా-ఏ-హింద్తో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.‘దేశంలో ప్రతి విషయాన్నీ కొన్ని మాధ్యమాలు మతం కోణంలో చూపిస్తున్నాయి. ఇది దేశానికి చెడ్డపేరు తెస్తున్నది’ అని వ్యాఖ్యానించింది. ఇలాంటి చానళ్లను నియంత్రించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించింది. జడ్జిలకు, వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎలాంటి జవాబుదారీతనం లేకుండా వార్తలు రాస్తున్నారని పేర్కొంది. పైగా అది తమ హక్కుగా భావిస్తున్నారని చీవాట్లు పెట్టింది. వెబ్ పోర్టళ్లు, యూట్యూబ్ చానళ్లలో బోగస్ వార్తలకు, నిందలు వేయడానికి అడ్డూఅదుపు ఉండటం లేదని పేర్కొంది.
నియంత్రణ ఏదీ?
యూట్యూబ్ చానల్ను ఎవరైనా ప్రారంభించే అవకాశం ఉందని, నకిలీ వార్తలను యథేచ్ఛగా చలామణీ చేస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో బోగస్ వార్తలను నియంత్రించడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేశారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. వెబ్ పోర్టళ్లతో పాటు ఆన్లైన్ మాధ్యమాలను నియంత్రించేందుకే కేంద్రం కొత్త ఐటీ రూల్స్ రూపొందించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. వార్తాపత్రికలు, టీవీ చానెళ్లపై నియంత్రణ వ్యవస్థ ఉండటాన్ని చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, ఈ విచారణను రెండు వారాలు వాయిదా వేయాలని మెహతా కోరారు. కొత్త ఐటీ నిబంధనలపై హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ను ప్రస్తుత పిటిషన్లతో కలిపి విచారణ చేపట్టడానికి కూడా ధర్మాసనం అంగీకరించింది.
ఎన్జీటీకి సుమోటో అధికారం లేదు: కేంద్రం
చట్టం ప్రకారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు సుమోటో అధికారం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్టీటీకి సుమోటో అధికారంపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తున్నది. ఈ కేసులో సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ అమికస్ క్యూరీగా కోర్టుకు సహకరిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలో వ్యర్థాల నిర్వహణ తీరును ఎన్జీటీ సుమోటోగా తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్కు రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ అంశం కూడా ప్రస్తుత విచారణలో భాగంగా ఉన్నది.