పట్నా: బీహార్లోని గంగానదిలో (Ganga river) ఘోర ప్రమాదం జరిగింది. పట్నా సమీపంలోని దానాపూర్ వద్ద సుమారు 55 మంది ప్రయాణిస్తున్న పడవ గంగానదిలో బోల్తాపడింది. దీంతో సుమారు పది మంది కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. మిగిలినవారు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. గల్లంతైనవారికోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. నది మొత్తం జల్లెడ పట్టినప్పటికీ వారి ఆచూకీ లభించలేదని చెప్పారు.
గంగాహర ద్వీపంలో కూలి పనులు ముగించుకుని సొంతూర్లకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అయితే పడవ ఒక్కసారిగా మునిగిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు నదిలోకి దూకారని, ఈత వచ్చిన వారు ఒడ్డుకు చేరాగా మిగిలిన వారు గల్లంతయ్యారని చెప్పారు.