న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం విజయ్ దివస్ వేడుకల్లో మన తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ప్రస్తావనను తీసుకురాలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. మోదీ సర్కార్ స్త్రీద్వేషాన్ని నరనరానా జీర్ణించుకుందని దుయ్యబట్టారు. 50 ఏండ్ల కిందట ఇదే రోజున ఇందిరాగాంధీ నాయకత్వంలో భారత్ బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిందని అన్నారు.
ప్రధాని మోదీ మహిళలు చేసిన సేవలను గుర్తించి గౌరవించడం ప్రారంభించాలని ప్రియాంక గాంధీ చురకలు వేశారు. మరోవైపు విజయ్ దివస్ వేడుకల్లో ఇందిరా గాంధీ పేరును ప్రస్తావించకపోవడం పట్ల ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరా గాంధీ పేరును ఈ ప్రభుత్వం ప్రస్తావించలేదని సత్యం అంటే ఈ ప్రభుత్వానికి ఎంత భయం పట్టుకుందో ఇది వెల్లడిస్తోందని వ్యాఖ్యానించారు.
నరేంద్ర మోదీ సర్కార్ దేశాన్ని విభజించి, నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం నుంచి దేశం నేర్చుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. రాహుల్ డెహ్రాడూన్ ర్యాలీలో మాట్లాడుతూ భారత్ సమైక్యంగా పోరు సలపడంతో 1971 యుద్ధంలో పాకిస్తాన్ 13 రోజులకే తలవంచిందని గుర్తుచేశారు.