Israel embassy | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ, కదలికలు గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ ఎంబసీకి వచ్చే రహదారుల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
చాణక్యపురిలోని ఎంబసీ వద్ద మంగళవారం సాయంత్రం 5:48 గంటలకు పేలుడు జరిగిందని ఎంబసీ ప్రతినిధి గై నిర్ తెలిపారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి భారత్లోని తమ పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. ఎంబసీ వద్ద పేలుడును ఉగ్రవాద దాడిగా ఇజ్రాయెల్ అభివర్ణించింది.
ఇజ్రాయెల్ పౌరులు మాల్స్, మార్కెట్లు తదితర రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, బహిరంగ ప్రదేశాలతో పాటు అన్నిచోట్లా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గుంపులుగా ఎక్కడికీ వెళ్లవద్దని.. ఎక్కడికి వెళ్లినా తమ ఐడెంటినీ సాధారణ వ్యక్తులకు చెప్పొద్దని సూచించింది. సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేయొద్దని చెప్పింది. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం రాయబార కార్యాలయం వెనుకాల పేలుడు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ ఎంబసీ సెక్యూరిటీ గార్డు సమాచారం అందించాడని, వంద మీటర్ల దూరంలో ఉన్న సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని పేర్కొన్నారు.