విద్యుత్ శాఖలో ప్రైవేటీకరణను నిరసిస్తూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో సోమవారం నుంచి అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 36 గంటలుగా చండీగఢ్ చీకటిలోనే ఉండిపోయింది. నీటి సరఫరా కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఓ రకంగా ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది.పరిస్థితిని అర్థం చేసుకొని, ఉద్యోగులు వెంటనే సమ్మెను విరమించాలని అధికారులు అభ్యర్థిస్తున్నా… ఉద్యోగులు ససేమిరా అంటున్నారు.
దీంతో చండీగఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీని రంగంలోకి దింపింది. విద్యుత్ను పునరుద్ధరించడానికి ఆర్మీ యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. దాదాపు 100 మంది ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకూ దాదాపు 80 విద్యుత్ సెంటర్లను పునరుద్ధరించామని పేర్కొన్నారు. ఇక.. 100 మంది జవాన్లతో పాటు ఢిల్లీ, జలంధర్కు చెందిన విద్యుత్ అధికారులను కూడా రంగంలోకి దింపారు. దీంతో కాస్త పరిస్థితి మెరుగుపడింది.
విద్యుత్ ఉద్యోగులు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో చండీగఢ్లో పరిస్థితులు అదుపు తప్పాయి. ఆస్పత్రులతో పాటు ఎమర్జెన్సీ విభాగాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎమర్జెన్సీ ఆపరేషన్లను వాయిదా వేసుకున్నామని కూడా డాక్టర్లు వెల్లడించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక… విద్యార్థుల ఆన్లైన్ క్లాసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు.