లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజం ఖాన్ (Azam Khan) ఇంట్లోకి ‘చేతబడి’ వస్తువులుగా అనుమానించే ఒక మూటను ఒక వ్యక్తి విసిరాడు. ఆయన భార్య దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలాగే ఆ ఇంటి వద్ద భద్రతలో నిర్లక్ష్యం వహించిన నలుగురు పోలీస్ సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు. గురువారం ఉదయం ఆరు గంటలకు ఒక గుడ్డతో చుట్టి ఉన్న చిన్న మూటను ఆజం ఖాన్ ఇంటి గేటు లోపలకు ఒక వ్యక్తి విసిరాడు. ఆ మూటలో కొన్ని బట్టలు, ఒక టోపీ, ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో చేతబడికి సంబంధించిన వస్తువులుగా ఆజం ఖాన్ భార్య, మాజీ ఎంపీ తజీన్ ఫాత్మా అనుమానించింది. దీనిపై రాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంటి వద్ద పోలీస్ సిబ్బంది భద్రతగా ఉన్నప్పటికీ ఈ సంఘటన జరుగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
కాగా, రాంపూర్ ఎస్పీ అశోక్ కుమార్ శుక్లా ఈ సంఘటనపై స్పందించారు. మానసిక వికలాంగుడైన ఒక వ్యక్తి ఆజం ఖాన్ ఇంట్లోకి ఒక మూటను విసిరినట్లు తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆ వ్యక్తిని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. అలాగే ఆజం ఖాన్ ఇంటి వద్ద భద్రతగా ఉన్న పోలీసు సిబ్బంది విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో నలుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
మరోవైపు ఆజం ఖాన్, రాంపూర్ స్థానం నుంచి ఒకసారి ఎంపీగా, పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ద్వేషపూరిత ప్రసంగం కేసులో స్థానిక కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. దీంతో ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఆయన కోల్పోయారు. గత ఏడాది జైలు నుంచి విడుదలైన ఆజం ఖాన్పై పలు నేరారోపణ కేసులు కూడా ఉన్నాయి.
Also Read: