న్యూఢిల్లీ: ఫిబ్రవరి 4వ తేదీన విపక్ష మహిళా ఎంపీలు.. లోక్సభలో ప్రధాని మోదీ సీటు వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీని వల్ల ఆ రోజు ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడలేకపోయారు. ఈ వివాదం లోక్సభలో ఇంకా కొనసాగుతున్నది. ఇవాళ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ మహిళా ఎంపీలు(BJP Women MPs) లేఖ రాశారు. ఆ విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం ఇదే తరహాలో విపక్ష ఎంపీలు స్పీకర్ బిర్లాకు లేఖ రాశారు. అన్యాయంగా తమను ఆరోపిస్తున్నట్లు ఆ లేఖలో మహిళా ఎంపీలు ఆరోపించారు.
రూల్స్ ప్రకారం ఆ ప్రతిపక్ష ఎంపీలపై కఠిన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఎంపీలు తమ లేఖలో కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను అగౌరవపరిచినట్లు ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిర్వహించిన తీరుపై స్పీకర్ బిర్లాను బీజేపీ మహిళా ఎంపీలు ప్రశంసించారు. సభా మర్యాదను, హుందాతనాన్ని కాపాడినట్లు పేర్కొన్నారు. ఆ రోజున లోక్సభ ఛాంబర్లో జరిగిన ఆ దురదృష్టకర సన్నివేశాన్ని యావత్ దేశం వీక్షించిందన్నారు. విపక్ష పార్టీ ఎంపీలు హౌజ్ వెల్లోకి దూసుకెళ్లడమే కాకుండా స్పీకర్ టేబుల్పై ఎక్కే ప్రయత్నం చేసినట్లు లేఖలో ఆరోపించారు. పేపర్లను చింపేసి, స్పీకర్పై విసిరేశారన్నారు.
కొందరు మహిళా సభ్యులు దురుసుగా ప్రవర్తించారని, బ్యానర్లు.. ప్లకార్డులు పట్టుకుని మంత్రులు ఉన్న బెంచీల వైపు వెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రధాని సీటును సీజ్ చేయడమే కాకుండా సీనియర్ మంత్రులు ఉండే ట్రెజరీ బెంచ్లను కూడా ఆ ఎంపీలు ఆక్రమించినట్లు లేఖలో ఆరోపించారు.