లక్నో : రైతుల సమస్యలకు సంబంధించి తన పార్టీ నేతృత్వంలోని యూపీ సర్కార్పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ శుక్రవారం మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీలోని వ్యవసాయ మార్కెట్లలో అవినీతి రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. రైతుల ఇబ్బందుల గురించి ఆయన బరేలిలోని ఓ మండీలో అధికారితో మాట్లాడుతున్న వీడియోను వరుణ్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేశవ్యాప్తంగా రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్మేలా వ్యాపారులు, దళారులు కుమ్మక్కవుతున్నారని ఈ వీడియోలో వరుణ్ గాంధీ సదరు అధికారితో పేర్కొనడం కనిపించింది.
రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను తాను సహించనని వారిని అరెస్ట్ చేసేలా కోర్టుకెక్కుతానని అధికారిని వరుణ్ గాంధీ వీడియోలో హెచ్చరించారు. దళారుల ప్రమేయం లేకుండా తమ ఉత్పత్తులను అమ్ముకునే రైతులను అధికారులు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఓ వ్యవసాయ మార్కెట్ను సందర్శించగా అక్కడ 5 కాంటాలు ఉన్నట్టు రికార్డుల్లో ఉన్నా కేవలం మూడే పనిచేస్తున్నాయని వరుణ్ గాంధీ చెప్పుకొచ్చారు. రైతు సమస్యలపై గళమెత్తుతున్న వరుణ్ గాంధీని బీజేపీ అగ్రనాయకత్వం పక్కనపెట్టినా ఆయన పలు సందర్భాల్లో అన్నదాతలకు భరోసా కల్పించేలా తన వాణి వినిపిస్తూనే ఉన్నారు.