న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ప్రముఖ హర్ కీ పౌరీ ఘాట్లో గంగా హారతి ఇచ్చిన క్రమంలో కాషాయ పార్టీ నేత ఆయనపై సెటైర్లు వేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాహుల్ హిందువుగా మారతారని బీజేపీ నేత తేజీందర్ పాల్ సింగ్ బగ్గా ఎద్దేవా చేశారు. రాహుల్ చునావి హిందూ కాబట్టే పూజారి ఆయనకు సూచనలు చేయాల్సి వచ్చిందని గంగా హారతి సందర్భంగా రాహుల్కు సలహాలిస్తున్న పూజారి వీడియోను బగ్గా షేర్ చేశారు.
ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం ప్రార్ధిస్తూ గంగా నదికి ప్రణమిల్లానని రాహుల్ మూడు వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సైతం రాహుల్ గాంధీపై ఇదే తరహా విమర్శలు చేశారు. గాంధీ కుటుంబం యాధృచ్ఛిక హిందువులని వారిని హిందువులని పిలవలేమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు రాగానే వారు హిందువులవుతారని యోగి ఎద్దేవా చేశారు. కాగా ఉత్తరాఖండ్ పర్యటనలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.
నరేంద్ర మోదీ ప్రధాని కాదని, ఆయన ఓ రాజుగా భావిస్తుంటారని చురకలు వేశారు. ఎవరి మాట వినకుండా ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ప్రధాని అంటే అందరి బాగుకోసం పనిచేయాలని, అందరి అభిప్రాయాలు స్వీకరించాలని అన్నారు. మోదీ అలాంటి వ్యక్తి కాదని, ఏడాది పాటు రైతుల కడగండ్లను ఆయన పట్టించుకోలేదని, రాజు తరహాలో ఎవరితో మాట్లాడకుండా, ఎవరి మాట వినకుండా వ్యవహరించారని అన్నారు. యూపీఏ హయాంలో దేశాన్ని ప్రధానమంత్రి పాలించేవారని, ఇప్పుడు దేశాన్ని రాజు పాలిస్తున్నారని..ఏ ఒక్కరినీ సంప్రదించకుండా ఆయన నిర్ణయాలు తీసుకుంటారని దుయ్యబట్టారు.