బెంగళూర్ : బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం డీవీ సదానంద గౌడ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని సంకేతాలు పంపారు. బెంగళూర్ నార్త్ సీట్ను తనకు ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడంతో ఆయన గుర్రుగా ఉన్నారు.
తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ పార్టీ అగ్రనేతల నుంచి ఆహ్వానం వచ్చిందని, అయితే తాను ఆ పార్టీలో చేరబోనని సదానంద గౌడ స్పష్టం చేశారు. బెంగళూర్ నార్త్ సీటును తనకు కాకుండా మరొకరికి పార్టీ కట్టబెట్టడంతో బీజేపీ తీరు పట్ల తాను నిరాశకు గురయ్యానని చెప్పారు.
నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్నారు. పార్టీలో నియంతృత్వ వైఖరి ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, పార్టీ కోసం కష్టపడిన నేతలను పక్కనపెట్టడం సరైంది కాదని ఆయన బీజేపీ అగ్రనేతల తీరును తప్పుపట్టారు. బాధ్యతలు చేపట్టిన నేతలు స్వార్ధంతో వ్యవహరించడం విచారకరమని యడ్యూరప్ప లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. యడ్యూరప్ప కుమారుడు, రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయేంద్రను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ ఓ కుటుంబంలా తయారైందని ప్రజలు అంటున్నారని విమర్శలు గుప్పించారు.
Read More :